![]() |
![]() |

-చిత్ర పరిశ్రమ సైతం షాక్ అయ్యే కన్నీటి గాధ ఆ హీరోయిన్ ది
-బాలనటిగా రంగ ప్రవేశం
-మొదటి భర్తతో విడాకులు
-ఆరుగురు పిల్లలున్న స్టార్ హీరోతో రిలేషన్
-చివరకి కోమాలో తుదిశ్వాస విడిచిన వైనం
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో నటీమణులు తమ నటనతో, అందంతో వెండితెరని ఏలారు. కానీ గ్లామర్ ప్రపంచం వెనుక వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే తుఫానులు కొందరి జీవితాలని అతలాకుతలం చేస్తాయి. అలాంటి ఒక అరుదైన, కన్నీటి గాథే అలనాటి అందాల తార పుష్పవల్లి(Pushpavalli)జీవితం. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన పుష్పవల్లి అసలు పేరు కందల వెంకట పుష్పవల్లి తాయారమ్మ. చిన్నతనం నుంచే సినిమా పోస్టర్లను చూస్తూ పెరిగిన ఆమెకు, వెండితెరపై మెరవాలనే కోరిక బలంగా ఉండేది.
దాంతో 1936లో రాజమండ్రిలోని దుర్గా సినీటోన్ స్టూడియో నిర్మించిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలో బాల సీతగా నటించే అవకాశం వచ్చింది. అప్పుడే ఆమె వయసు కేవలం 9 సంవత్సరాలు. ఆ మూవీలో కేవలం 3 రోజుల షూటింగ్కి గానూ . 300 పారితోషికం లభించింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అక్కడ్నుంచి విరామం లేకుండా హీరోయిన్గా, సహాయ నటిగా కెరీర్ కొనసాగించాల్సి వచ్చింది. 1942 లో వచ్చిన 'బాలనాగమ్మ' లో ఆమె పోషించిన సంగు క్యారక్టర్ మంచి గుర్తింపు తెచ్చింది. కెరీర్ పరంగా 1930 నుండి 1960 వరకు దాదాపు 40కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులని అలరించారు.
వృత్తిపరంగా ఎంతో నిబద్ధతతో సాగిన పుష్పవల్లి జీవితం, వ్యక్తిగత నిర్ణయాల వల్ల తీవ్రమైన సవాళ్లతో, ఒడిదుడుకులతో నిండిపోయింది. ఆమెకు మొదట ఐ. వి. రంగాచారితో వివాహం జరిగి బాబ్జీ, రామ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా ఆ బంధం 6 ఏళ్లకే ముగిసిపోయింది. ఆ తర్వాత ప్రముఖ తమిళ నటుడు జెమినీ గణేషన్తో పరిచయం ఏర్పడింది. అప్పటికే జెమినీ గణేషన్కి వివాహమై ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ, వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సామాజిక ఆంక్షలు, ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విమర్శల మధ్య వారు సహజీవనం సాగించారు.
జెమినీ గణేషన్ ద్వారా పుష్పవల్లికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. వారిలో పెద్ద కుమార్తె మరెవరో కాదు, బాలీవుడ్ని దశాబ్దాల పాటు శాసించిన ఎవర్ గ్రీన్ అందాల నటి రేఖ. చిన్న కుమార్తె పేరు రాధ. అయితే, జెమినీ గణేషన్ పుష్పవల్లిని తన చట్టబద్ధమైన భార్యగా ఎప్పుడూ పూర్తిగా అంగీకరించలేదు. పైగా ఆ తర్వాత మహానటి సావిత్రిని వివాహం చేసుకోవడంతో పుష్పవల్లి తీవ్ర ఒంటరితనంలోకి వెళ్లారు. ఆ తర్వాత కూడా ఒక సినిమా నిర్మాతతో ఆమె రిలేషన్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కుమార్తెలు రేఖ, రాధని ఒంటరి తల్లిగా పెంచడానికి ఆమె పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పిల్లలకి సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగారు. బి. ఎన్. రెడ్డి నిర్మించిన 'రంగుల రాట్నం' చిత్రం ద్వారా రేఖ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత బాలీవుడ్లో తిరుగులేని నటిగా స్థిరపడి తన తల్లికి, కుటుంబానికి కొండంత ఆసరాగా నిలిచారు.పుష్ప వల్లి చివరి రోజుల్లో తీవ్రమైన డయాబెటిస్ తో బాధపడి కోమాలోకి వెళ్లారు. 1994 లో కోమాలోనే తుది శ్వాస విడిచారు. వెండితెరపై ఒక వెలుగు వెలిగినా నిజ జీవితంలో ప్రేమ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చేసిన పోరాటం ఎప్పటికీ ఒక కన్నీటి గాథే.
.webp)
![]() |
![]() |